top of page

భారతదేశ చరిత్రలోనే మొదటి మహిళా నాయకురాలు - సావిత్రిబాయి ఫూలే

Updated: Mar 6, 2021

డా॥ జి.వి. రత్నాకర్



మానవులందరూ భగవంతుని బిడ్డలే. ఈ విషయం ఎప్పటి వరకూ మనకు అర్థం కాదో అప్పటి వరకు భగవంతుని సత్యం అర్ధం కాదు. మానవులందరమూ సోదరులమే అన్న భావము నిర్మితం అయినప్పుడే ఈశ్వరుని కనుగొనే మహోన్నతమైన లక్షణం అర్ధం అవుతుంది. కానీ ఈ విషయాన్ని నిర్లక్య్యంచేస్తూ తమకుతాము గొప్పవాళ్ళం. అని భావించుకుంటూ మహర్‌, మాంగ్‌ లాంటి అంటరానివాళ్ళను హీనంగా చూస్తున్నారు. అంటతగిన వాళ్ళు, అంటరాని వాళ్ళు అనే బేధభావాన్ని ప్రదర్శించడం మూర్ధత్వం. ఎక్కువ, తక్కున కులాల సృష్టి మానవ కల్పితమే. స్వార్థపరులైన కొందరు తమనితాము గొప్పగా ఆపాదించుకొని తమ వంశస్తుల ప్రయోజనాలకోసమే కులాల్ని సృష్టించారు. సాటి మానవుల్ని అంటరాని వారిగా భావించడం మానవత్వపు లక్షణం కాదు. మానవులందరూ ఈ కులభేదాల అమానవీయతని తిరస్కరించాలి. అప్పుడే ప్రతి మనిషికీ, సమాజానికీ, దేశానికీ మానవ సంన్కృతికి మేలు ఒనగూడుతుంది. - సావిత్రీబాయి ఫూలే


ఇలాంటి మహోన్నతమైన భావాలతో కూడిన ఆలోచనలు కలిగిన సావిత్రీబాయి రచనలు, ప్రసంగాలు మానవజాతి చరిత్రలోనే ఎన్నతగినవి. సావిత్రీబాయి ఫూలే అద్భుతమైన ప్రతిభాపాటవాలు కలిగిన రచయిత్రి. అధ్యాపక వృత్తిలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, రచనారంగంలో కూడా తనదైన ముద్రవేసిన మేధావి సావిత్రీబాయి.


నేటివరకు సావిత్రీబాయిని జ్యోతిబాపూలే భార్యగానే కీర్తించారు. జ్యోతిబాపూలే సావిత్రీబాయిని చదివించాడు. అధ్యాపకురాల్ని చేసాడు అనేదే నేటి చరిత్ర చెపుతుంది. కానీ సావిత్రీబాయి జాతిపిత జ్యోతిబాఫూలే నడిపించిన విప్లవాత్మకమైన నేటి ఉద్యమాల్లో

మహోన్నతమైన పాత్రని నిర్వహించింది.


కనుకనే జ్యోతిబాపూలే ఒకచోట “నేను నా జీవితంలో ఏమైనా చెయ్యగలిగానంటే అదంతా నా భార్య సహకారంతోనే చేయగలిగాను. నా ఉద్యమ జీవితంలో సావిత్రీబాయి పాత్రని మరువలేను” అంటాడు. భారతదేశ చరిత్రలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి. 19వ శతాద్దిపు మేధావి మరియు ప్రతిభాపాటవాలు కలిగిన రచయిత్రి సావిత్రీబాయి. పండిత రమాబాయి అనే అగ్రకుల స్త్రీ కంటే రెండు దశాబ్దాల ముందే తన వైదుష్యాన్ని ప్రతిభాపాటవాల్ని సావిత్రీబాయి ప్రదర్శించింది. తన కుటుంబాన్ని పిల్లల్ని కనాలనే కోరికని త్యజించి ప్రపంచమే ఇల్లుగా చేసుకొని అనాధల్ని అక్రమ సంతానంగా పుట్టి రోడ్లపాలైన బిడ్డల్నే తన బిడ్డలుగా చేసుకుంది సావిత్రీబాయి.


భారతదేశ చరిత్రలోనే ఎన్నదగిన సామాజిక విప్లవకారుడిగా కీర్తించబడ్డ జ్యోతిబా ఫూలేకి అన్ని రకాలుగా తన అండదండల్నిచ్చింది. భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది. సావిత్రీబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతోపాటు ఉద్యమ జీవితంలో కలిసి నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. గొప్ప వ్యక్తి భార్యగా సావిత్రీబాయి సభలు సమావేశాల్లో పాల్గొనలేదు. సరైనరీతిలో భర్త ఆలోచనల్లో,

ఆచరణలో సగపాలుగా ఆమె కలిసిపోయింది.


సావిత్రీబాయి ౩ జనవరి 1831న మహారాష్ట్రలోని సతారాజిల్లా నాయగాంవ్‌ (గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి ఖండోజీనేవసే పాటిల్‌ 1840లో జ్యోతిబాఫూలేతో ఆమె వివాహం జరిగింది. సగుణాబాయి క్షీరసాగర్‌ అనే ఆమెతో కలిసి సావిత్రీబాయి భర్త ప్రోత్సాహంతో మిచెల్‌ అనే బ్రిటిష్‌ మిషనరీ పాఠశాలలో చదువుకుంది. విద్యార్థి దశలో సావిత్రీబాయి నీగ్రోల మానవహక్కుల పోరాటయోధుడు థామస్‌ క్లార్మ్‌సన్‌ ఉద్యమ చరిత్రని చదివింది. 1848 జనవరిలో భారతదేశ చరిత్రలో స్థాపించబడిన మొదటి మహిళా పాఠశాలకి అధ్యాపకురాలిగా తర్వాత ప్రధాన అధ్యాపకురాలిగా నియమించబడింది సావిత్రీబాయి. ఆ పాఠశాలలో బ్రాహ్మణ బాలికలు కూడా చదువుకునేవారు కాని ఫూలే దంపతులు జరుపుతున్న ఈ మత వ్యతిరేక, మనుస్కృతికి వ్యతిరేకమైన చర్యలకి కోపించి దారిలో అగ్రకులస్తులు ఆమెపై పేడ, రాళ్ళు విసిరేవారు. అప్పుడు ఆమె “నా సోదరులారా, నన్ను ప్రోత్సహించేందుకు మీరు నాపై వేస్తున్న ఈ రాళ్ళే

నాకు పూలహారాలుగా మారుతున్నాయి. మీ ఈ చర్యలద్వారా నాకు సరైన జీవనపాఠం లభిస్తుంది. నేను నిరంతరం నా సోదరీమణులకి మరింతగా సేవచేస్తాను. భగవంతుడు మిమ్మల్ని, మీ చర్యల్ని ఆశీర్వదించును గాక” అనేది.


సావిత్రీబాయి “కావ్యఫూల్‌” అనే కవితా సంపుటిని 1954లో ప్రచురించింది. శూద్రుల, అతిశూద్రుల (అంటరానివారు) ప్రగతికోసం, ఉద్ధరణ కోసం పాటుపడిన ఆమె తపన ఆ కవితల్లో వ్యక్తమవుతుంది. శూద్రుల దుఃఖం అనే కవితలో “రెండు వేల ఏళ్ళ శూద్రుల దుఃఖం ఇది. భగవంతుని సేవ, భూదేవతల సేవ అనే (బ్రాహ్మణులు) పద్మవ్యూహంలో వీళ్ళు చిక్కుకున్నారు. వీళ్ళ అవస్థని చూసి నా మనసు దహించిపోతుంది. శూద్రుల దుఃఖ నివారిణి విద్యమాత్రమే. విద్యతో మానవత్వం వికసిస్తుంది. పశుత్వం నశిస్తుంది”అంటుంది సావిత్రీబాయి.


సావిత్రీబాయి ఉత్తమమైన అధ్యావకురాలు మాత్రమే కాదు నిస్వార్థమైన సంఘసేవకురాలు కూడా. శూద్రుల, అతిశూద్రుల, మహిళల నాయకురాలు కూడా. భర్త స్థాపించిన సత్యశోధక సమాజాన్ని భర్త మరణానంతరం ఆమె నడిపించింది. ఫూ! పనిచేసిన ఎంతోమంది సంఘ సేవకుల భార్యల్లో ఎవరూకూడా సావిత్రీబాయిద్యమబాటలో నడవలేదు.


శూద్రుల్లో పుట్టిన చదువులేని సావిత్రీబాయి చదువుకొని అధ్యాపకురాలిగా ఇంగ్రీషుభాష నేర్చుకోవడం అనేది నాటి కాలంలో కలలో కూడా ఊహించలేము.


ఒకచోట సావిత్రీబాయి “2 వేల ఏళ్ళుగా అగ్రకులస్తుల మనుకునే వాళ్ళు శూద్రుల్ని, అతిశూద్రుల్ని జ్ఞానానికి, సంపదకి దూరం చేసారు. ఈ కారణంగానే విదేశస్తులు మనదేశాన్ని

ఆక్రమించి అగ్రకులస్తుల్ని ఓదించారు. మనం కేవలం చూస్తూ ఉండటమే కాదు విదేశీయులకి

సహాయం అందించాము. ఇదే సరైన చరిత్ర. దీనికి అగ్రకులస్తులే కారకులు. పిడికెడంతమంది

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చాలా అహంకారంతో విదేశస్తులతో యుద్ధం చేశారు.

కనీసం మనల్ని మాట మాత్రంగా కూడా అడగలేదు. జ్ఞానం, సంపదతో వాళ్ళు ఉన్మాదులయ్యారు. వాళ్ళే మనకు శత్రువులయ్యారు. అజ్ఞానం, బలహీనత, నిస్సహాయత మోసాల పద్మవ్యూహంలో చిక్కుకున్న శూద్రులు, అంటరానివారిలో విద్యతోనే చైతన్యం వస్తుంది. కనుకనే చదువుకోడానికి ఊగిసలాట ఇప్పుడు వద్దు. లేదంటే మన తరతరాలు ఈ దుర్దశనే అనుభవించాల్సి వస్తుంది” అంటుంది.


కవిత్వ రచనలో, ప్రసంగాల్లో విప్లవాత్మకమైన ఆలోచనల్లో, ఆచరణలో సావిత్రిబాయి భర్తకి ఏమాత్రం తీసిపోదు. ఆధునిక భారత సామాజిక విప్లవ చరిత్రలో సావిత్రీబాయికి స్వతంత్రమైన వెలకట్టలేని స్థానం ఉంది. ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగానే కాక సామాజిక జీవితాన్నే కుటుంబ జీవితంగా మార్చుకున్న విప్లవకారిణి ఆమె. ఆమె భర్తతోపాటు స్త్రీ విముక్తికి విద్యాద్వారాలు తెరిచి భారత మహిళా విముక్తి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నాడు సావిత్రీబాయి ప్రారంభించిన మహిళా సాధికార ఉద్యమ ఫలాలే నేడు అనేకమంది అగ్రకుల మహిళలు అనుభవిస్తున్నారు. పురుషులతో ధీటుగా పదవుల్ని అధిరోహిస్తున్నారు. కానీ వాళ్ళు సావిత్రీబాయి కృషిని మరచిపోకూడదు. ఈ మహిళలు బ్రాహ్మణ స్త్రీలైనా, లేక ఇతర అగ్రకుల స్త్రీలైనా వాళ్ళ నేటి ప్రగతికి తళుకుబెళుకుల జీవితానికి పునాదివేసింది ఒక శూద్ర స్త్రీ అని వాళ్ళు తెలుసుకోగలగాలి. సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. శూద్రుల, అంటరానివారి మధ్య ఉన్న విభేదాల మూలంగా బ్రాహ్మణవాదం బలపడుతుంది అని తన రచనలద్వారా ఆనాడే సావిత్రీబాయి తెలియపరిచింది. నాటి సావిత్రీబాయి ఆలోచనలు నేటి వర్తమాన సామాజిక జీవనపు దుస్థితికి అద్దంపడుతున్నాయి. అగ్రకులస్తుల దృష్టిలో శూద్రులు కూడా అంటరానివారేనని ఆమె ఆనాడే తెలియపరిచి దళిత ఆదివాసీ, వెనుకబడిన కులాల ఐక్యత కోసం సావిత్రీబాయి పరితపించింది.


సావిత్రీబాయి అనాధయిన బ్రాహ్మణ వితంతువు కొడుకుని అక్కున చేర్చుకుని యశ్వంత్‌ అనే పేరుపెట్టి బిడ్డగా పెంచి డాక్టరుని చేసింది. కలరావచ్చి రోడ్డుపై పడ్డ ఒక మహర్‌ పిల్లవాన్ని ఎవరూ పట్టించుకోని దశలో తానే ఆ పిల్లవాన్ని భుజాన వేసుకొని యశ్వంత్‌ నడిపే ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. ఆ కారణంతో సావిత్రిబాయికి కూడా కలరావచ్చి ఆమె 10 మార్చి 1897న అదే మహర్‌ బస్తీలో మరణించింది.


శూద్రుల, అంటరానివారి విద్యకోసం పరితపించిన సావిత్రిబాయి ఒక కవితలో-మనకి ఒకే ఒక్క శత్రువు ఉన్నాడు

ఆ శత్రువుని మనం ఐక్యతతో తుదముట్టిద్దాం


అంతకుమించి మనకి శత్రువులెవరూ లేరు


ఆ దుర్మార్గపు శత్రువు పేరు చెప్తాను


అందరూ సరిగా వినండి


ఆ శత్రువే అజ్ఞానం” అంటుంది.



మరోచోట ఆమె-


లెండి సోదరులారా నిద్రలేవండి
అంటరాని సోదరులారా చైతన్యంతో నినదించండి
శతాబ్దాల బానిసత్వంపై సమరశంఖం ఊదండి
సోదరులారా విద్యకోసం ఉద్యమించండది” అంటుంది.

భర్త మరణాంతరం సావిత్రీబాయి 1891 నుండి 1897 వరకు సత్యశోధక సమాజాన్ని నడిపించింది. 1893లో పుణె దగ్గరి సాస్‌వడ్‌లో ఆమె అధ్యక్షతన సత్యశోధక 'సమాజక వార్షిక సమావేశం జరిగింది. 19వ శతాబ్దపు మొదటి ముస్లిం మహిళా అధ్యాపకురాలు ఫాతిమాషేక్‌ కూడా సావిత్రీబాయితో కలిసి ఫూలే స్థాపించిన పాఠశాలలో పనిచేసింది.


భారతదేశ మహిళల్లోనే మొదటగా విద్య నేర్చుకున్న స్త్రీ సావిత్రిబాయి. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అన్ని కులాల స్త్రీలకి మొదటి నాయకురాలు. జాతిపిత మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలపట్ల అచంచలమైన విశ్వాసం ఆమెకు ఉంది. అంటరానితనానికి వ్యతిరేకంగా దేశ చరిత్రలోనే ఉద్యమించిన మహిళా నాయకురాలు సావిత్రీబాయి. దళిత, ఆదివాసీ, వెనుకబడిన, మైనారిటీ కులాల స్త్రీల ఐక్యతకోసం ఆమె పాటుపడింది. ఆమె దూరదృష్టి మంచి ఆచరణ, విద్యపట్ల (ప్రేమ, ధృడ సంకల్పం మహోన్నతమైనవి. ఆమె జీవితాంతం పీడిత, రైతు, పేద, కూలీ ప్రజల ప్రగతికోసం పాటుపడింది. భారతదేశ చరిత్రలోనే గుర్తించుకోదగిన మొదటి మహిళా నాయకురాలు సావిత్రీబాయి. ఆమె సదా స్మరణీయురాలు.


0 comments
bottom of page